సమయానికి ముందే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో తమ బలబలాలను తేల్చుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాబాస్ – గేమ్ చేంజర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే అధికార టీఆర్ఎస్ బలం తగ్గినట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుంది? మొదటి మూడు స్థానాలు ఎవరివి? ఎన్ని సీట్లలో హోరాహోరీ పోరు నడుస్తుంది? తదితర విషయాలను వెల్లడించింది.
గేమ్ చేంజర్ సంస్థ తాజా సర్వే ప్రకారం టీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. ఆ పార్టీకి 35 స్థానాలు సులువుగా వస్తాయని చెప్పింది. కానీ ఎన్నికలు జరిగే సమయానికి వీటిల్లో మార్పు ఉండొచ్చని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని, బీజేపీకి 18 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎంఐఎం పార్టీ 7, ఇతరులు 3 స్థానాలు గెలుచుకుంటారని తెలిపింది. 35 స్థానాల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందని, వీటీల్లో ఎక్కువ సీట్లలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ మధ్యే గట్టి పోరు నడుస్తుందని సర్వే సంస్థ గేమ్ చేంజర్ తెలిపింది. పైకి జోష్ కనిపిస్తున్న కూడా బీజేపీకి నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేకపోవడం మైనస్గా మారుతోంది.