అమరావతి, మార్చి 14, 2026: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తృత స్థలంలో నిర్మించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్లో ఈ విగ్రహం ప్రతిష్టించబడింది. తెలుగు ప్రజల కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. శంకుస్థాపన జరిగిన ఆరు నెలల్లోనే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన ఈ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” తెలుగు జాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ట్రస్ట్ అధికారులు తెలిపారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: మార్చి 16, 2026 (సోమవారం)
సమయం: ఉదయం 10 గంటలు
వేదిక: అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్, శాఖమూరు, అమరావతి
ఈ మహోత్సవానికి తెలుగు వారందరూ పాల్గొని, తెలుగు జాతి గర్వకారణమైన ఈ ఘట్టాన్ని విజయవంతం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేష్ సాదరంగా ఆహ్వానించారు. ఆయన “ఇది తెలుగు జాతి అందరికీ గర్వకారణమైన సమయం. ప్రతి ఒక్కరూ హాజరై ఈ చారిత్రక కార్యక్రమాన్ని మరింత వైభవోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు.
ఈ విగ్రహం తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకంగా నిలుస్తుందని, పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని తరతరాలకు చాటుతుందని రాజకీయ నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

